ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : శామీర్పేట మండలం బొమ్మరాసిపేట రైతుల భూ సమస్య పరిష్కారం కోసం శామీర్పేట రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై రైతులకు మద్దతు తెలిపారు. 1969లో రైతులు కొనుగోలు చేసిన భూములను బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు కలిసి రైతుల కళ్లల్లో మట్టి కొట్టారని ఆయన ఆరోపించారు.నిషేధ జాబితాలో చేర్చిన భూములకు కనీసం 40 శాతం డబ్బులు ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. భూములను 22(ఏ) నిషేధ జాబితాలో చేర్చింది ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఆదేశాలతోనే జరిగిందని ఆరోపించారు.కళ్లుమూసుకుని పిల్లి పాలు తాగినట్లు సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు ధైర్యం చెప్పి, వారి తరఫున పోరాడాలని బీజేపీ కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేసిందన్నారు. అందుకు అనుగుణంగా పార్టీ తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంగారెడ్డి, మెదక్, భువనగిరి, సిద్దిపేట, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఈటల ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు ఫైళ్లపై సంతకాలు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ప్రజలను ఇంతగా వేధించే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు.
బొమ్మరాసిపేట రైతుల భూములపై పోరాటం..! శామీర్పేట రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసనకు ఈటల రాజేందర్ హాజరు
RELATED ARTICLES
