ఆర్.జె.న్యూస్, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శతాబ్దాల చరిత్ర గల శ్రీ మైసమ్మ తల్లి బోనాల జాతరను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు చిర్రబోయి వైష్ణవి యాదవ్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, గత 45 ఏళ్లుగా తమ కుటుంబం తరఫున అమ్మవారికి బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపును సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. తాతల తండ్రుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని అదే భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నామని వైష్ణవి తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జాతర ప్రాంగణాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో, ఆకర్షణీయమైన లైటింగ్ కమాన్లతో అలంకరిస్తున్నామన్నారు. ఈ అలంకరణలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి జాతర మరింత వేడుకగా ఉండేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ప్రముఖ కళాకారులను రప్పిస్తున్నామని వైష్ణవి వెల్లడించారు. వారి సాంస్కృతిక ప్రదర్శనలతో జాతరకు ప్రత్యేక శోభ చేకూరనుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె కోరారు.
