మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 4 :
మేడ్చల్ జాతీయ రహదారిపై ఓ డీసీఎం TS10UA1024 నంబర్ గల వాహనం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వెనుక భాగం నుంచి ప్రమాదకరంగా పొడుచుకొచ్చిన ఇనుప రాడ్లతో వాహనం రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్న దృశ్యం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఐషర్ డీసీఎంలో భారీగా లోడ్ చేసిన ఇనుప రాడ్లు వాహనం వెనుక భాగం నుంచి దాదాపు 5-6 అడుగుల మేర బయటకు పొడుచుకు వచ్చాయి. ఎలాంటి రెడ్ ఫ్లాగ్, రిఫ్లెక్టర్ సూచికలు లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నాడు.
ప్రమాద ఘంటికలు :-
వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారులు, కార్లు ఈ రాడ్లను గమనించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ తరహా వాహనాలు రోడ్డుపై మృత్యుపాశాలుగా మారుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి నిర్లక్ష్యం..?
నిబంధనల ప్రకారం వాహనం బాడీ దాటి లోడ్ బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చినా రెడ్ ఫ్లాగ్ కట్టి, రాత్రి వేళ రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ నిబంధనలు గాలికొదిలేశారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డిమాండ్ :-
ఇలాంటి ప్రమాదకర వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
