ఆర్.జె.న్యూస్, మేడ్చల్: పాన్షాప్ నిర్వహిస్తున్నట్లు బయటకు కనిపిస్తూ.. లోపల మాత్రం గంజాయి చాక్లెట్ల అక్రమ విక్రయానికి పాల్పడుతున్న వ్యక్తిని శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి భార్య పరారీలో ఉండగా, ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ చక్రపాణి వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన బైద్నాద్ (29) తన భార్య పూజా కుమారితో కలిసి శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంట చంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. తూముకుంటలో పాన్షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పాన్షాప్ను అడ్డాగా చేసుకుని గంజాయి చాక్లెట్ల విక్రయానికి పాల్పడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
🔸బీహార్ నుంచి భారీగా సరుకు
బీహార్ నుంచి పెద్ద మొత్తంలో గంజాయి చాక్లెట్లను తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్ను రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయిస్తూ అక్రమ దందా సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న శామీర్పేట్ పోలీసులు బైద్నాద్ నిర్వహిస్తున్న పాన్షాప్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 5,298 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు, సుమారు 25 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బైద్నాద్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
🔸భార్య కోసం గాలింపు
ఈ గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో బైద్నాద్ భార్య పూజా కుమారి కూడా పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె ప్రస్తుతం పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ చక్రపాణి తెలిపారు. సమావేశంలో శామీర్పేట్ సీఐ నరసింహారెడ్డి, డీఐ మహేష్, ఎస్ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
