🔸వివక్ష, వేధింపులపై అధికారులు తక్షణమే స్పందించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎస్సీ, ఎస్టీల పౌరహక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా తూముకుంటలో శనివారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష, సామాజిక అణచివేత, దాడులు, వేధింపులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం విలువలను పాటించాలని అన్నారు.బాధితులు పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా చట్టప్రకారం తక్షణమే స్పందించాలని సూచించారు. దాడులు, అవమానాలు, భూవివాదాలు, సామాజిక వివక్షకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ భూముల సమస్యలు, సంక్షేమ పథకాలు, పౌరహక్కుల ఉల్లంఘన కేసులను జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్, ఆర్డీఓ వెంకటరెడ్డి, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

