🔸జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి.. చపాతీ పెనంతో వాతలు
ఆర్.జె.న్యూస్,తాండూరు : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల/హాస్టల్లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడికి పాల్పడి తీవ్రంగా హింసించిన ఘటన వెలుగుచూసింది.
తాండూరు పట్టణంలో కొనసాగుతున్న పెద్దేముల్ మండలానికి చెందిన సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో సాయి బాలాజీ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు లోకేష్, మణికంఠ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చపాతీ పెనంతో ఒంటిపై కాల్చి వాతలు పెట్టడంతో పాటు తీవ్రంగా కొట్టినట్లు బాధిత విద్యార్థి వాపోయాడు. ఇలాంటి ఘటనలు గతంలోనూ పలుమార్లు జరిగాయని తెలిపాడు. దాడి విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లు జూనియర్లపై దాడులకు పాల్పడుతున్నా పాఠశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థులను పలకరించేందుకు వచ్చిన తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ సరిగా మాట్లాడకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురుకులంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు.
