ఆర్జె..న్యూస్,మేడ్చల్ : జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రామం బీసీ కాలనీలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. శనివారం సాయంత్రం తండ్రి మిరపకాయల బండి ఏర్పాటు చేసేందుకు బయటకు వెళ్లాడు. అనంతరం కుమార్తెకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపు తెరిచి చూడగా యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
