ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పరశురామ్ (40) జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా అలియాబాద్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టింది. అనంతరం కారు అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
