ఆర్.జె.న్యూస్, మాదాపూర్ : ఖానామెట్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. రాత్రి సమయంలో పొలవరపు తేజస్, దట్టి మోహిత్ ఇద్దరు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై బిక్షపతి నగర్ లోని ఎస్ ఎస్ ప్రీమియం పీజీ నుంచి మెటల్ చార్మినార్ వైపు వెళ్తున్నారు. మెటల్ చార్మినార్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న పొలవరపు తేజస్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న దట్టి మోహిత్ కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఖానామెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
