ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ :
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్రెడ్డి (ఐపీఎస్) శుక్రవారం గుండ్లపోచంపల్లిలోని అపర్ణ తులిప్, మ్యారిగోల్డ్, ఎల్లోబెల్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. గణేష్ ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112ను సంప్రదించాలని సీపీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ , ఎస్ఐలు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
