- ♦️మున్సిపల్ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు.
♦️ అధికారిక హోదా లేకుండానే ప్రజా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ.
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామం 9వ వార్డు కౌన్సిలర్ కార్యాలయంలో అధికారిక హోదా లేని వ్యక్తి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వార్డు కౌన్సిలర్ రజిత రాజేందర్ నాయక్ భర్త రాజేందర్ నాయక్ అధికారిక కుర్చీలో కూర్చొని ప్రజలను కలుస్తూ, ప్రజా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ స్థానికుడు కుమార్ శ్యామ్ మున్సిపల్ కమిషనర్తో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆగస్టు 3న ఉదయం కౌన్సిలర్ కార్యాలయంలో అధికారిక హోదా లేని వ్యక్తి కౌన్సిలర్ కుర్చీలో కూర్చొని ప్రజలతో సమావేశమవుతున్నట్లు గమనించానని, దీనికి సంబంధించిన ఫొటోలను ఆధారాలుగా సమర్పించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధి కాని వ్యక్తి కౌన్సిలర్ అధికారాల్లో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించాలని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు అధికార హోదా లేని వ్యక్తులు కౌన్సిలర్ కార్యాలయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ను వినతిపత్రం ద్వారా కోరారు.
