ఆర్ జె న్యూస్, హైదరాబాద్ (మియాపూర్) :
రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మియాపూర్ పరిధిలో ఒక జెప్టో (Zepto) డెలివరీ బాయ్పై జరిగిన దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
♦️ కేసు వివరాల్లోకి వెళ్తే…
పోలీసుల కథనం ప్రకారం, ప్రధాన నిందితుడైన బసోడి అభిషేక్ ఒంటరిగా వెళ్తున్న జెప్టో డెలివరీ బాయ్ని అడ్డుకుని తీవ్రంగా బెదిరించాడు. బాధితుడి వద్ద ఉన్న రూ. 5,000 నగదును బలవంతంగా లాక్కున్నాడు. అంతేకాకుండా, బాధితుడి మొబైల్ ఫోన్ను బలవంతంగా అన్లాక్ చేయించి, అతని బ్యాంక్ ఖాతా నుండి ఆన్లైన్ ద్వారా మరో రూ. 900లను తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు నిందితుడు బసోడి అభిషేక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి దోచుకున్న సొమ్ములో రూ. 400 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు :
అరెస్ట్ అయిన నిందితుడు అభిషేక్పై కేవలం మియాపూర్లోనే కాకుండా గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, మధురానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా పలు దోపిడీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి సమయాల్లో రహదారులపై ఒంటరిగా వెళ్లే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఈ నిందితుడి అలవాటుగా మారిందని పోలీసులు తెలిపారు.
