ఆర్ జె న్యూస్ డెస్క్ : ప్రజాధనంతో రూ.22 కోట్ల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకునే KCR తెలంగాణకు అవసరమా అని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్ చార్జి మధు యాష్కీ గౌడ్ ప్రశ్నించారు. KCRను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు BRS ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. “లక్ష ఉద్యోగాలు ఎక్కడ? మూడెకరాల భూమి ఏమైంది? దళిత సీఎం హామీ ఏమైంది?” అని నిలదీశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనలో మహిళలకు ఉచిత బస్సు, రూ.37 వేల కోట్ల రుణమాఫీ, రూ.33 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, “రాముడి పేరుతో చందాలు వసూలు చేసిన చందా చోరులకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదు” అని BJPపై ఫైర్ అయ్యారు. రేపు ఇందిరాపార్క్ ధర్నాకు రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా తరలిరావాలని, ప్రతి డివిజన్ నుంచి 2,000 నుంచి 2,500 మంది హాజరు కావాలని పిలుపునిచ్చారు.
