తిరుపతి (ఆర్ జె న్యూస్) జూలై 4 : ప్రభుత్వ రుణం మంజూరు పేరుతో లంచం డిమాండ్ చేసిన తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను ఏపీ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. చేపల పెంపకం కోసం ఒక రైతుకు రూ.50 లక్షల రుణం మంజూరైంది. ఆ రుణం ఫైల్ క్లియర్ చేయడానికి డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రూ.6 లక్షలు లంచం అడిగాడు. దీంతో బాధిత రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ఫిర్యాదు ధృవీకరించి ట్రాప్ ప్లాన్ చేశారు. రూ.6 లక్షల్లో మొదటి విడతగా రూ.3 లక్షలు తీసుకుంటుండగా రెడ్డయ్యను అధికారులు పట్టుకున్నారు. అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ సిబ్బంది అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని తదుపరి విచారణ కోసం SPE & ACB స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ పథకాలు, రుణాలు, సబ్సిడీల పేరుతో ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
