ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా :
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు సద్దుమణిగాయి. డివిజన్ అధ్యక్ష పదవి వివాదంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేసిన స్థానిక నాయకులు సీనియర్ నేతల జోక్యంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ చొరవతో అసంతృప్త నాయకులతో జరిపిన చర్చలు ఫలించాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్, మాజీ డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వివాదానికి అధికారికంగా తెరపడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇకపై గుండ్లపోచంపల్లి 299 డివిజన్లో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పార్టీలో ఉంటూ గ్రూపు రాజకీయాలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడం లేదా ఇతర పార్టీలకు వత్తాసు పలకడం సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోచారం డివిజన్ అధ్యక్షుడు రాజేష్, ఫిర్జాగూడా డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మాజీ మండల అధ్యక్షులు వరదరెడ్డి, కృష్ణ యాదవ్, మాజీ జెడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్, పానుగంటి మహేష్, కుండ భానుచందర్, తాటికాయల కోమలతతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
