♦️ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలిసి విజ్ఞప్తి చేసిన ఎంపీ ఈటల రాజేందర్
ఆర్ జె న్యూస్ ఢిల్లీ : తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం మరింత సహకారం అందించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహన్ ను సహచర ఎంపీలతో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన #PMGSY కింద రాష్ట్రానికి మరిన్ని గ్రామీణ రహదారులను మంజూరు చేయాలని కోరారు. గ్రామాల అనుసంధానం మెరుగుపడితే రైతులు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన #PMAY కింద అర్హులైన పేద కుటుంబాలకు అధిక సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదల సొంత ఇంటి కల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం అండగా నిలవాలని ఈటల రాజేందర్ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ భేటీలో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, మాధవనేని రఘునందన్ రావు, గోడం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు.
