🔸ఒడిశా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ వైభవాన్ని తలపించేలా నమూనా
🔸సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఆధ్వర్యంలో సిద్ధం
ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ బాలాపూర్ : ప్రతి ఏడాది ప్రత్యేక ఆలయ థీమ్లతో భక్తులను ఆకట్టుకుంటున్న బాలాపూర్ గణేష్ ఈసారి మరో అద్భుతంతో ముందుకు రానున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్లో బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
🔸పూరీ జగన్నాథ ఆలయ వైభవం
జగన్నాథ స్వామి ఆలయ కట్టడం, గోపురం, శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ నమూనాను రూపొందిస్తున్నారు. భక్తులకు కనుల పండుగగా, హృదయాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేలా ఈ ప్రత్యేక దర్శనం ఉండనుంది. గతంలో బాలాపూర్ గణేష్ అరుణాచలేశ్వర ఆలయం, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, యాద్రి స్వర్ణగిరి ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం వంటి పుణ్యక్షేత్రాల థీమ్లలో దర్శనమిచ్చి విశేష ఆదరణ పొందారు. ఈ అద్భుతమైన ఆలయ నమూనాలను ప్రతి ఏడాది
🔸సుధాకర్ రెడ్డి డెకరేటర్స్
రూపొందిస్తున్నారు. వారి కళాత్మకత, చక్కదనంతో రూపుదిద్దుకున్న ప్రతి థీమ్ భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను, భక్తి శ్రద్ధలను మరింత పెంచుతోంది. గత సంవత్సరాల వైభవాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది పూరీ జగన్నాథ ఆలయ థీమ్లో బాలాపూర్ గణేష్ దర్శనం భక్తులకు మరపురాని అనుభూతిగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.
🔸లక్షలాది భక్తుల తాకిడి
బాలాపూర్ గణేష్ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది పూరీ జగన్నాథ్ థీమ్తో మరింత మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
