గుండ్లపోచంపల్లి, జూన్ 30: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి సూచించారు. గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లిలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బీఎల్వోలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను నింపి తప్పనిసరిగా అందజేయాలన్నారు. “సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఓటు హక్కును కోల్పోతే భవిష్యత్లో జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదు” అని హెచ్చరించారు. ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా బీఆర్ఎస్ నాయకులు ఓటర్ జాబితాను పరిశీలిస్తూ, సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించారా లేదా అని వాకబు చేయాలని సూచించారు. బీహార్, పశ్చిమబెంగాల్లో ప్రాంతీయ పార్టీలు ఓడిపోవడానికి ఓట్ల గల్లంతు కూడా కారణమని గుర్తు చేశారు. ఏ ఒక్క ఓటు కూడా సర్లో పోకుండా చూడాలని బీఎల్వోలకు సూచించిన ఆయన, అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు నర్సింహ గౌడ్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, సదానంద్, సింహాల్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి : మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి
RELATED ARTICLES
