ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్య ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నిన్న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు.మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్, మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల బీఆర్ఎస్ నేతలు తాతా మధు, నవీన్ కుమార్ అనుచిత భాషను ఉపయోగించారని ఆరోపించారు.
స్పీకర్ పదవికి, అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ వంటి ప్రజాస్వామ్య వేదికపై సభ్యులు హుందాగా వ్యవహరించాలని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నేమురి రాంప్రసాద్ గౌడ్, ఊరడి వెంకటేష్, గుర్రం బస్వారెడ్డి, ముద్దం ధర్మారెడ్డి, నర్ల మల్లేష్ యాదవ్, ముద్దం వీరారెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
