🔸వాచ్మన్పై అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు
🔸ఇంట్లో 15 తాకట్టు చిట్టీలు లభ్యమయ్యాయంటూ కలకలం
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాయల్ సాయి సదన్ అపార్ట్మెంట్లో సుమారు ఐదు తులాల బంగారు నగలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 501లో నివసిస్తున్న కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాలు సుమారు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయినట్లు తెలిసింది.నగల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీసిన క్రమంలో అపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మన్పై అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాచ్మన్ నివాసంలో పరిశీలించగా వివిధ దుకాణాల్లో బంగారం, వెండి వస్తువులను తాకట్టు పెట్టినట్లు పేర్కొంటున్న సుమారు 15 చిట్టీలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురైనట్లు తెలిసింది.అయితే ఆ తాకట్టు చిట్టీలకు ఫ్లాట్లో మాయమైన బంగారు నగలతో సంబంధం ఉందా? లేదా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బాధిత కుటుంబ సభ్యులు ఘటనపై మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
