అక్టోబర్ 1 నాటికి 15 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: అదనపు కలెక్టర్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రానున్న ధాన్యం కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) జి. విజయేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలోని 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ 1 నాటికి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కేంద్రంలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తూకం, గన్నీ బ్యాగులు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు.
ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు అవసరమైన శిక్షణను ముందుగానే అందించాలని అధికారులకు సూచించారు. ధాన్యం నిల్వల కోసం అవసరమైన గోదాములను గుర్తించి సిద్ధంగా ఉంచాలని SWC, AMC మేనేజర్లను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని తెలిపారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా జిల్లా స్థాయిలో నిరంతర సమీక్ష చేపట్టాలన్నారు.రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లలో జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ సూచించారు.
