మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 11 :
కాండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో (సీఎంఆర్టీసీ) 2026 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులకు డిగ్రీ ధ్రువపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలు, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎంఎస్ఎంఈ – డీఎఫ్వో హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ సి.ఎస్.ఎస్. రావు మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్య సాంకేతిక ఆవిష్కరణలకు, సమాజాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని అన్నారు. కాగ్నిజెంట్ ప్రతినిధులు రఘు కులకర్ణి, జితేందర్ సింగ్ విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సీఎంఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ సీహెచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన ఇంజనీర్లుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. వైస్ చైర్మన్ సీహెచ్ అభినవ్ రెడ్డి గ్రాడ్యుయేషన్ కొత్త జీవితానికి నాంది అని పేర్కొనగా, సెక్రటరీ సీహెచ్ వసంతలత వృత్తి జీవితంలో విజయాలతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఎ. రాజిరెడ్డి, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు
