ఆర్.జె.న్యూస్, అబిడ్స్ : ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అబిడ్స్ లోని ఐడీబీఐ బ్యాంకు ఆవరణలో ఉద్యోగులు సమ్మెకు మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగి విఠల్ రావు మాట్లాడుతూ, ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, బ్యాంకు యాజమాన్యాలను కోరారు. బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పీఎల్ఐ) ఉద్యోగుల మధ్య విభజనకు దారితీస్తుందని, అలాంటి విధానాలను అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
