🔸రేషన్ షాపులు, సంక్షేమ వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు
🔸అక్రమాలకు తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా.. సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కమిషన్ కొరడా ఝళిపించింది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం మేడ్చల్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రేషన్ దుకాణాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో రికార్డులు, సరుకుల నిల్వలు, ఆహార నాణ్యతను నిశితంగా పరిశీలించింది.
రేషన్ పంపిణీపై ఆరా
పట్టణంలోని పలు చౌకధరల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు.. నిల్వలు, ఈ-పాస్ యంత్రాలు, పంపిణీ రికార్డులను పరిశీలించారు. కార్డుదారులకు నిబంధనల మేరకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందుతున్నాయా? పంపిణీలో అక్రమాలకు ఆస్కారం ఉందా? అనే అంశాలపై ఆరా తీశారు. రికార్డుల నిర్వహణలో ఏ మాత్రం అవకతవకలు చోటుచేసుకున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయకుండా సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల భోజనంపై కొరడా
అనంతరం కిష్టాపూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను కమిషన్ బృందం తనిఖీ చేసింది. వంటగది, సరుకుల నిల్వలు, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించింది. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాల్సిందేనని తేల్చిచెప్పింది. వంటగది పరిసరాల్లో అపరిశుభ్రతకు తావులేకుండా చూడాలని ఆదేశించింది. విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం వహించినా.. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించింది.ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
