ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మండలం అక్బర్జాపేట్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్బర్జాపేట్కు చెందిన టేకుల గణేశ్ (20) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉండాలని తండ్రి హన్మంత్ ఇటీవల సూచించాడు. దీంతో గణేశ్ గత రెండు వారాలుగా విధులకు హాజరవుతున్నాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు తమ పనులకు వెళ్లగా.. గణేశ్ కూడా భోజన డబ్బాతో ఉద్యోగానికి బయలుదేరాడు. ఉదయం 10 : 40 గంటల సమయంలో బంధువు బాల్రాజ్కు ఫోన్ చేసి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై గణేశ్ కోసం గాలించారు. ఈ క్రమంలో వ్యవసాయ పొలం సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే ఘన్పూర్లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని, మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
