మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 3 : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న ఓపెన్ డ్రైనేజీ నాలాలు, ప్రధాన మురుగు కాలువల పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అలియాబాద్ ఆవాస ప్రాంతం చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న డ్రైనేజీలను సందర్శించి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు.నాలాల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారం, వ్యర్థాలను వెంటనే తొలగించి వర్షపు నీరు, మురుగునీరు ఎలాంటి ఆటంకం లేకుండా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తి, ప్రజారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మరమ్మతులు, శుభ్రత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూడికతీత పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని స్పష్టం చేశారు.ప్రజలు కూడా డ్రైనేజీ నాలాల్లో చెత్త వేయకుండా మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
