ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బ కోల్డ్ స్టోరేజ్లో ఫ్యూజ్ మారుస్తుండగా నూతనకల్ గ్రామానికి చెందిన బేస్త నాగరాజు (28) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. గ్రామంలో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు, శుక్రవారం లైన్మెన్ ఆచార్య ఆదేశాల మేరకు గుబ్బ కోల్డ్ స్టోరేజ్లో ఫ్యూజ్ మార్చేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫ్యూజ్ తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో నూతనకల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
