ఆర్ జె న్యూస్ మేడ్చల్ :
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ పిలుపునిచ్చారు.మేడ్చల్ డివిజన్కు చెందిన కనకాల శివకుమార్ (బిపిటి రాజు)కు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నియామకపత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మేడ్చల్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యం జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం నిరంతరంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ లక్షలాది పేద కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ కుమార్ యాదవ్, జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్ (యూసుఫ్), ఏఎంసీ డైరెక్టర్ రేగు రాజు కురుమ, మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు, కిష్టాపూర్–పూడూర్ డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
