ఆర్.జె.న్యూస్, న్యూఢిల్లీ : ఇకపై జాతీయ గీతం ‘జనగణమన’తో పాటు జాతీయ గేయం ‘వందేమాతరం’ను పాడకుండా అడ్డుకున్నా, ఆలాపనకు భంగం కలిగించినా కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు జాతీయ గౌరవ భంగ నిరోధక (సవరణ) చట్టం, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. పార్లమెంటు ఉభయ సభలు ఇటీవల ఈ బిల్లును ఆమోదించగా, రాష్ట్రపతి సంతకంతో ఇది అధికారికంగా చట్టరూపం దాల్చి వెంటనే అమల్లోకి వచ్చింది.
🔸చట్టంలో కీలక మార్పులు
1971 నాటి జాతీయ గౌరవ నిరోధక చట్టం పరిధిని ఈ సవరణ ద్వారా విస్తరించారు. ఇప్పటివరకు జాతీయ గీతాన్ని పాడకుండా అడ్డుకుంటేనే శిక్షార్హ నేరంగా ఉండేది. తాజా సవరణతో వందేమాతరం గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పించారు.
సవరణ ప్రకారం..
– జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా పాడకుండా అడ్డుకున్నా
– ఆలాపనలో నిమగ్నమైన సభకు, సమూహానికి భంగం కలిగించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
🔸శిక్షా నిబంధనల్లో మార్పు లేదు
జాతీయ గీతం, జాతీయ గేయం రెండింటినీ శిక్షా పరంగా ఒకే స్థాయిలో నిలిపారు. అయితే శిక్షా పరిమాణంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటికే ఉన్న గరిష్ఠ 3 ఏళ్ల జైలు శిక్ష నిబంధనే కొనసాగుతుంది. జాతీయ చిహ్నాల పట్ల గౌరవాన్ని పెంచేందుకు, వాటి అవమానాన్ని అరికట్టేందుకు ఈ సవరణ తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
