♦️మరమ్మతులతో పాటు సీసీ రోడ్లు నిర్మిస్తాం : పింకేష్ కుమార్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ 297 డివిజన్ పరిధిలోని రోడ్ల దుస్థితిని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత రామన్నగారి మణికంఠ గౌడ్ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ను స్వయంగా తీసుకెళ్లి రోడ్ల పరిస్థితిని చూపించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మణికంఠ గౌడ్ తెలిపారు. చినుకు పడితే రోడ్లపై నీరు నిలిచి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు రోడ్లు లేని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని జోనల్ కమిషనర్ను కోరారు. అలాగే మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై ఉన్న రోడ్డుతో పాటు నిత్యం రద్దీగా ఉండే చెక్పోస్ట్ రోడ్డును కూడా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ.. మేడ్చల్ డివిజన్ పరిధిలోని రోడ్ల దుస్థితిని స్వయంగా పరిశీలించామని తెలిపారు. రోడ్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తదితరులు పాల్గొన్నారు.
